తారకరత్నకు వచ్చిన వ్యాధి మెలెనా.. దీని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

తారకరత్న  ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే తారకరత్న అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. మెలెనా అనే అరుదైన వ్యాధితో తారకరత్న బాధపడుతున్నారని వైద్య బృందం ప్రకటించింది. జీర్ణశయాంతర (గ్యాస్ట్రో ఇంటెస్టినల్)  రక్తస్రావాన్ని మెలెనాగా పేర్కొంటారు. మామూలుగా మెలెనా వల్ల ఎగువ జీర్ణశయాంతర మార్గంతో పాటు.. నోరు, అన్నవాహిక, కడుపు, చిన్న ప్రేగు మొదటి భాగం నుంచి రక్తస్రావం సంభవిస్తుంది. కొన్నిసార్లు ఎగువ జీర్ణశయాంతర దిగువ భాగంలో ఉండే పెద్ద ప్రేగు ఆరోహణ భాగంలో కూడా రక్తస్రావం జరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. 

మెలెనా వ్యాధి రావడానికి కారణాలు:

  • ఎగువ జీర్ణశయాంతర మార్గం దెబ్బ తినడం
  • కడుపులో పుండ్లు, కడుపులో యాసిడ్ ఉత్పత్తి అధికంగా ఉండడం
  • రక్తనాళాల్లో వాపు
  • రక్తస్రావం
  • రక్త సంబంధిత వ్యాధుల వల్ల మెలెనా వస్తుంది. 

మెలెనా వ్యాధి లక్షణాలు:

  • మెలెనా వ్యాధి సోకితే.. మలం నల్లగా, బంక మాదిరి వస్తుంది. దుర్వాసన విపరీతంగా వస్తుంది. 
  • మెలెనా వల్ల శరీరంలో రక్త స్థాయి తగ్గిపోతుంది. రక్తహీనతతో పాటు బలహీనమైపోతారు. 
  • కొన్ని సార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. 
  • శరీరం లేత రంగులోకి మారిపోతుంది.
  • అలసట, విపరీతమైన చెమటలు, గందరగోళం అనిపించడం, అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి జరుగుతాయి. 
  • రక్తం తక్కువగా పోయే పరిస్థితిలో.. పొత్తి కడుపు నొప్పి, అజీర్తి, బలవంతంగా మింగడం, చిన్న ప్రేగులో రక్తస్రావం అవ్వడం, నోటి నుంచి రక్తం రావడం, రక్తపు వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 
  • మెలెనా వ్యాధికి చికిత్సలు:

మెలెనా వ్యాధి సోకిన వారికి పెప్టిక్ అల్సర్ ట్రీట్మెంట్ తో పాటు ఎండోస్కోపీ థెరపీ, సర్జికల్ థెరపీ, ఆంజియోగ్రాఫిక్ ఎంబలైజేషన్, రక్తమార్పిడి చికిత్సలు చేస్తారు. అయితే మెలెనా వల్ల కొన్ని సందర్భాల్లో రక్తస్రావం విపరీతంగా అవుతుంది. ముక్కు,చెవులు, నోరు సహా పలు చోట్ల నుంచి రక్తస్రావం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన గుండెపోటు తర్వాత.. రక్తనాళాల్లో రక్తస్రావం అవుతుంది. అలాంటప్పుడు గుండెకు చికిత్స చేయడంలో సవాళ్లు ఎదురవుతుంటాయి. అందుకోసం కృత్రిమ గుండె కదలిక కోసం ఎక్మో మెషిన్ ఇంప్లాంటేషన్ చేస్తారు. ఇక రక్తపోటు కూడా మెలెనా స్థితిని తగ్గిస్తుంది. అందుకే రక్తపోటు సమతుల్యత కోసం ప్రత్యేక మిషన్ అప్లికేషన్ ఉపయోగించి.. చికిత్స అందిస్తారు. 

తారకరత్నకు కూడా ఈ విధంగానే చికిత్స చేస్తున్నట్లు తెలుస్తోంది. తారక్ గుండె నాళాల్లోకి రక్తప్రసరణ కష్టంగా అవుతుండడంతో.. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా గుండె నాళాల్లోకి రక్తాన్ని పంపిణీ చేసేందుకు వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. తారకరత్నకు నైపుణ్యం కలిగిన వైద్య బృందం అధునాతన చికిత్స అందిస్తోందని నందమూరి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, కళ్యాణ్ రామ్ సోదరి సుహాసిని, దగ్గుబాటి పురంధేశ్వరి, టీడీపీ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. సోమవారం నాడు మరోసారి పరీక్షలు చేసి.. హెల్త్ బులిటెన్ ను ప్రకటిస్తారని పురంధేశ్వరి అన్నారు. చంద్రబాబు, పురంధేశ్వరి తారకరత్న ఆరోగ్యం గురించి వైద్యులతో మాట్లాడారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని చంద్రబాబు కోరారు.