ఆషాడ మాసంలో ఎందుకు గోరింటాకు పెట్టుకుంటామో తెలుసా ..?

ఆషాడ మాసం అంటే ముందుగా గుర్తొచ్చేది గోరింటాకు. ఈ మాసంలో ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకుంటారు. అలాగే కొత్తగా పెళ్లయిన ఆడపిల్లలు తల్లి గారి ఇంటికి వస్తారు. అయితే గోరింటాకు పెట్టుకోవడానికి ఒక పురాణకథ ఉంది. గోరింటాకు అంటే గౌరీ ఇంట ఆకు అని అర్థం. పూర్వం పర్వత రాజు కుమార్తె గౌరీదేవి బాల్యంలో తన చెల్లి కత్తెలతో వనంలో ఆటలాడే సమయంలో రజస్వల అయింది. ఆ రక్తపు చుక్క నేలను తాకింది. దీంతో అక్కడ గోరింట చెట్టు పుట్టింది.

ఈ విషయం పర్వత రాజుకు చెప్పగా సతీసమేతంగా చూసేందుకు వచ్చాడు. ఆ చెట్టు పర్వత రాజుతో నేను సాక్షాత్తు పార్వతి రుద్రాక్షతో జన్మించాను. నావల్ల ఈ లోకానికి ఎటువంటి ఉపయోగం కలుగుతుంది అని అడిగింది. అప్పుడు పార్వతి చిన్నతనం చేష్టలతో ఆ చెట్టు ఆకు కోసింది. వెంటనే ఎర్రగా అయ్యాయి. దీంతో పర్వత రాజు కంగారుపడి ఏమైంది అనేలోపు పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు. ఇది చూడడానికి చాలా అలంకారంగా కనిపిస్తుంది.

కావాలంటే పెట్టుకొని చూడండి అంటుంది. దీంతో పర్వత రాజు ఆ చెట్టుకు ఒక వరం ఇస్తాడు. నిన్ను అందరూ అలంకార వస్తువుగా వాడుతారు. నీ చెట్టు ఆకు పెట్టుకున్న వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు అని వరం ఇచ్చారు. శాస్త్రీయపరంగా ఆలోచిస్తే గోరింటాకు వలన గర్భాశయ దోషాలు తొలగిపోతాయి. హార్మోన్స్ పనితీరు చక్కగా ఉంటుంది. చర్మం కూడా సున్నితంగా తయారవుతుంది. అయితే గోరింటాకును ఆషాడ మాసంలోనే ఎందుకు పెట్టుకుంటారంటే ఈ కాలంలో వర్షాలు బాగా పడుతాయి. దీనివలన అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.

గోరింటాకు వలన ఇన్ఫెక్షన్స్ రావు. గోర్లు పుచ్చిపోకుండా ఉంటాయి. శరీరంలో ఉష్ణం పెరగకుండా కాపాడుతుంది. అలాగే పురాణాలలో గోరింటాకు మరొక కథ కూడా ఉంది. సీతాదేవిని రావణుడు లంకలో బంధిస్తాడు. ఆమె గోరింటాకు చెట్టుతో తన బాధను అంత చెప్పుకునేది. అయితే రాముడు సీతాదేవిని కలిసిన తర్వాత తనకు తోడుగా అండగా నిలబడిన గోరింట చెట్టు గురించి చెప్పింది. అప్పుడు రాముడు గోరింటాకు చెట్టుకి వరం ఇస్తాడు. ఎవరైతే గోరింటాకు చెట్టును తన ఇంటి ముందు పెంచుకుంటారో వారి ఇంట్లో సుఖ సంతోషాలు మెండుగా ఉంటాయని వరం ఇస్తారు.