రైతులకు పంట పెట్టుబడి సాయం (రైతుబంధు) చెల్లింపులు ప్రారంభమయ్యాయి. రైతులకు వెంటనే నిధులను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రైతు భరోసా పథకానికి ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదన్నారు. గతంలో మాదిరిగా రైతులకు పెట్టుబడి సాయం చెల్లింపులు చేయాలని సీఎం ఆదేశించారు. దీంతో రైతులకు పంట పెట్టుబడి సాయం వారి ఖాతాల్లో జమ కానుంది. వాస్తవానికి రైతుబంధు నిధులు నవంబర్ నెలలో రైతుల ఖాతాల్లో పడాల్సి ఉంది. కానీ ఎన్నికల సమయంలో రైతుబంధును కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఈసీని అనుమతి కోరగా.. రైతుబంధు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ మళ్లీ కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుపడ్డారు. అలా రైతుబంధు నిధుల జమ ఆగిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా రైతులకు పెట్టుబడి సాయం(రైతుబంధు) కింద రూ.10వేలు అందించిన సంగతి తెలిసిందే. రైతుబంధుకు సంబంధించిన నిధులను నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల కారణంగా ఇవ్వలేకపోయింది .. కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులతో ఆగిన ఆ నిధులను ఇప్పుడు విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.