PM Kisan Yojana : పీఎం కిసాన్ డ‌బ్బులు రాలేదా.. అయితే ఇలా చేయండి..!

PM Kisan Yojana : ప్ర‌ధాని మోదీ దేశ‌వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం పీఎం కిసాన్ యోజ‌న (ప్ర‌ధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న‌) ప‌థ‌కాన్ని గ‌తంలోనే ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం విదిత‌మే. ఈ ప‌థ‌కం రైతుల‌కు ఒక వరం లాంటిది. ఇప్ప‌టికే ఎన్నో కోట్ల మంది రైతులు ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్ధి పొందుతున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రోమారు మోదీ అధికారంలోకి వ‌చ్చారు క‌నుక మ‌ళ్లీ ఈ ప‌థ‌కం కింద రైతుల‌కు 17వ ద‌ఫా కింద న‌గ‌దును బ‌దిలీ చేశారు. గ‌తంలో ఫిబ్ర‌వ‌రి 28వ తేదీన 16వ ద‌ఫా న‌గ‌దును ఇచ్చారు. ఇప్పుడు 17వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను రిలీజ్ చేశారు. దీనిపై మోదీ ప్ర‌ధాని అయ్యాక తొలి సంత‌కం చేశారు. ప్ర‌స్తుతం ఖ‌రీఫ్ స‌మ‌యం ఆరంభం అయింది. అందువ‌ల్ల రైతుల పెట్టుబ‌డికి ఈ న‌గదు ఉప‌యోగం కానుంది. అయితే ఈ ప‌థ‌కంలో మీరు ల‌బ్ధిదారులుగా ఉన్న‌ప్ప‌టికీ న‌గ‌దు బ‌దిలీ అవ‌డం లేదు అంటే మీరు ఈ-కేవైసీ చేయించుకోలేద‌ని అర్థం.

ఈ క్ర‌మంలోనే దీనికి సంబంధించిన వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. పీఎం కిసాన్ ప‌థ‌కానికి సంబంధించిన ఇన్‌స్టాల్‌మెంట్ ను ప్ర‌తి ఏడాది జూన్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా స‌మ‌యానికే రిలీజ్ చేశారు. అయితే ఈ న‌గ‌దు ఈ నెల చివ‌రి వ‌ర‌కు రైతుల ఖాతాల్లో జ‌మ కానుంది. ఇక ఈ విడ‌త కింద రూ.2వేల‌ను ఇస్తున్నారు. ఈ ప‌థ‌కం కింద న‌మోదు చేసుకున్న రైతులు త‌ప్ప‌నిస‌రిగా ఈ-కేవైసీ అప్‌డేట్ చేయించుకోవాలి. లేదంటే న‌గ‌దు బ‌దిలీ అవ‌దు. క‌నుక ఈ-కేవైసీ స‌రిగ్గా ఉందో లేదో రైతులు చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి అక్క‌డ ఈ-కేవైసీ అనే ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి. అక్క‌డ 12 అంకెలున్న మీ ఆధార్ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి. అనంత‌రం సెర్చ్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. దీంతో మీ మొబైల్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. దాన్ని న‌మోదు చేయాలి.

త‌రువాత స‌బ్‌మిట్‌పై క్లిక్ చేయాలి. దీంతో మీ కేవైసీ పూర్త‌వుతుంది. అయితే మీరు ఇచ్చిన స‌మాచారంలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని స‌రిచేసుకోవ‌చ్చు. లేదంటే మీ బ్యాంకు ఖాతాలో న‌గ‌దు బ‌దిలీ అవ‌దు. క‌నుక ఇలాంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు [email protected] కి ఈ-మెయిల్ పంపించ‌వ‌చ్చు. లేదా పీఎం కిసాన్ యోజన ఫోన్‌ నంబర్స్ 155261, 1800115526(టోల్ ఫ్రీ), లేదా 011-23381092కు కాల్ చేయ‌వ‌చ్చు. కాగా కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక ప‌థ‌కాల‌ను అందిస్తుండ‌గా వాటిల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. దీని ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భరోసాను ఇస్తుంది. పెట్టుబడి స‌హాయం అందిస్తుంది. ఈ పథకానికి అర్హత ఉన్న రైతులకు ప్రతి ఏడాది రూ. 6000 అందిస్తున్నారు. అయితే దీనిని ఒకేసారి కాకుండా 3 సమాన ఇన్‌స్టాల్‌మెంట్లలో అందిస్తుంది. అంటే ప్రతి ఇన్‌స్టాల్‌మెంట్లో రూ. 2000 చొప్పున రైతులకు వ‌స్తున్నాయి.