తుది అంకానికి చేరిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 18న మొదలైన బ్రహ్మోత్సవాలు తుది అంకానికి చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు చక్రస్నానం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారు, ఉభయదేవేరులు, చక్రత్తాళ్వారుకు స్నపన తిరుమంజనం జరిపారు.

అనంతరం శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులకు అనుమతించారు. గోవింద నామాలతో తిరు వీధులన్నీ మారుమోగాయి. ఈ రోజు రాత్రి నిర్వహించే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా.. భక్తులకు అసౌకర్యం కలగకుండా నిర్వహించారు.

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరుడి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమ‌వారం రాత్రి శ్రీ మలయప్పస్వామి అశ్వ వాహ‌నంపై కల్కి అలంకారంలో భ‌క్తుల‌కు దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్లు వేద‌మంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య స్వామివారి వాహన సేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.