వీడియో: ఆక్సిడెంట్ తర్వాత లైవ్‌లో అభిమానులతో మాట్లాడిన రంభ.

ప్రముఖ బహు భాషా నటి రంభ తాజాగా, కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. రంభ ప్రస్తుతం భర్త పిల్లలతో కలిసి కెనాడాలో ఉంటున్నారు. సోమవారం సాయంత్రం స్కూలు నుంచి పిల్లలను తీసుకుని వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఇంటర్‌సెక్షన్‌ వద్ద రంభ కారును మరో కారు ఢీకొట్టింది. సైడు నుంచి డోరు భాగంలో ఢీకొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. లోపల ఉన్న వారు కేవలం గాయాలతో బయటపడ్డారు. గాయపడ్డ వారిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను, ఫొటోలను స్వయంగా రంభే తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

తగిలినవి స్వల్ప గాయాలు కావటంతో మంగళవారం వారు ఆసుపత్రినుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ నిర్వహించారు. తమ కోసం దేవుడ్ని ప్రార్థించటంతో పాటు తనకు ఎంతో ధైర్యాన్ని, భరోసాను ఇచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. లైవ్‌ అనంతరం ఇందుకు సంబంధించిన ఓ ఆరు నిమిషాల వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేశారు. రంభ ఆ వీడియోలో మాట్లాడుతూ.. ‘‘ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా అభిమానులు, స్నేహితులు, కుటుంబసభ్యులు మేము క్షేమంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

నేను వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. థాంక్యూ సో మచ్‌. నేను, నా పిల్లలు క్షేమంగా ఉన్నాం. అందరం సేఫ్‌గా ఉన్నాం. మా కోసం ప్రార్థిస్తూ ఉండండి. మీ ప్రేమకు ఎంతో సంతోషంగా ఉంది. నా సంతోషాన్ని వ్యక్త పర్చడానికి నాకు మాటల రావటం లేదు. మేము ఇంటికి కూడా వచ్చాం’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రంభ క్షేమంగా ఇంటికి చేరుకున్నందుకు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రంభకు సన్నిహితులైన కుష్భు సుందర్‌, సంఘవి లాంటి నటీమణులు కూడా ఈ వీడియోపై స్పందించారు. రంభ కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకున్నారు.