అంబానీ గొప్ప మనసు, స్వయంగా వడ్డిస్తూ 51 వేల మందికి అన్నసేవా చేసిన ముఖేష్ అంబానీ.

బిజినెస్ రంగంలో తిరుగులేని రారాజుగా నిలిచిన ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ముకేశ్‌, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్‌, ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్‌ మర్చంట్ కుమార్తె రాధిక తో జూలైలో పెళ్లి జరుగనుంది. అయితే భారత అపరకుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ వివాహానికి సంబంధించిన సన్నాహాలు నెలక్రితమే మొదలయ్యాయి. ఇటీవలే తొలి పెళ్లి పత్రికను సిద్ధం చేసిన అంబానీ కుటుంబం మార్చి 1 నుంచి 3 వరకు ప్రీ-వెడ్డింగ్ వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు సిద్ధమైంది.

ఈ మేరకు ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు ముందు బుధవారం రాత్రి ‘అన్న సేవ’ కార్యక్రమాన్ని చేపట్టారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సామూహిక భోజనాలు ఏర్పాటు చేశారు. దాదాపు 51 వేల మందికి రుచికరమైన ఆహారాన్ని వడ్డించారు. కాబోయే వధూవరులు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌తో ఇరువురి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముకేశ్ అంబానీ కూడా పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారికి స్వయంగా భోజనాలు వడ్డించారు. అంబానీ ఇంట జరిగిన ‘అన్న సేవ’లో చుట్టుపక్కల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వారిలో కొంతమంది కాబోయే దంపతులు అనంత్-రాధిక చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. కొందరైతే బహుమతులు కూడా అందించారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఓ గ్రామస్థుడు ముఖేష్ అంబానీ కోసం తన ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని ముకేశ్ అంబానీకి తెలియజేయగా ఆయన స్వీకరించారు. ఆహార పాత్రను తన చేతుల్లోకి తీసుకొని సంతోషంగా తింటూ కనిపించారు. ఆహారాన్ని సిద్ధం చేసి తీసుకొచ్చిన వ్యక్తికి అభినందనలు తెలియజేశారు. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.