వైకుంఠ ఏకాదశి సాయంత్రం ఈ పూజ చేస్తే.. ఆర్థిక కష్టాలు మాయం!

హిందూ సంప్రదాయం ప్రకారం ఏకాదశి తిథికి చాలా విశిష్టత ఉంది. మన దగ్గర చాలా మంది.. నెలలో వచ్చే రెండు ఏకాదశి తిథుల్లో ఉపవాసం ఉంటారు. ఇక ఏడాదికి ఉండే 24 ఏకాదశుల్లో.. వైకుంఠ ఏకాదశికి మరింత విశిష్టత ఉంది. కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత నుంచి మకర సంక్రమణం వరకు జరిగే సమయంలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే.. ఈ రోజున వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులు భగవంతుని దర్శించుకుంటారు.

శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోడానికి.. తరలివెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి.. స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భమే ఈ వైకుంఠ ఏకాదశి. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ముక్కోటి ఏకాదశి రోజున ఉదయమే.. విష్ణు మూర్తిని దర్శనం చేసుకుని.. ఆ తర్వాత పూజ చేసి.. ఆరోజంతా ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని భక్తులు నమ్ముతారు. ఏడాది మొత్తంలో 24 ఏకాదశులు రాగా.. వాటిల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని వేదపండితులు చేబుతున్నారు.ఇక ముక్కోటి ఏకాదశికి సంబంధించి పురాణాల్లో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ రోజు శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై ఎక్కి.. మూడు కోట్ల దేవతలతో కలిసి..

భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. అలానే ఈ ఒక్క ఏకాదశి.. మూడు కోట్ల ఏకాదశులతో సరి సమానమైన పవిత్రతను సంతరించుకున్నందున.. దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని మరో కథ ప్రచారంలో ఉంది. అలానే క్షీరసాగర మధనం జరిగింది.. హాలాహలం, అమృతం రెండు పుట్టింది ముక్కోటి ఏకాదశి రోజునే అని కూడా ప్రచారంలో ఉంది. పురాణాల ప్రకారం.. శివుడు విషాన్ని మింగింది.. మహాభారత యుద్ధంలో.. శ్రీకృష్ణుడు.. అర్జునుడికి భగవద్గీతను బోధించింది కూడా ఇదే రోజు అని భక్తులు విశ్వసిస్తారు ముక్కోటి ఏకాదశి రోజున.. విష్ణుమూర్తిని నియమ నిష్ఠలతో పూజ చేసి.. ఏకాదశి వ్రతమాచరించే వారికి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం వంటివి భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తాయని అంటున్నారు.

ఒకవేళ ఎవరికైనా.. ఇవన్నీ చేయడానికి కుదరకపోతే.. వారు ఓం నమోనారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా.. తామనుకున్న పనులు విజయవంతం అవుతాయని అంటున్నారు. ఇక ఈ ఏడాది ముక్కోటి ఏకాదశికి మరో విశిష్టత ఉంది. సోమవారం రోజున ముక్కోటి ఏకాదశి వచ్చింది. సోమవారం శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది.. ముక్కోటి ఏకాదశి.. శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన తిథి. ఇలా ఒకేరోజు హరిహరులకు ఇష్టమైనది కావడంతో.. ఈ ముక్కోటి ఏకాదశి మరింత విశిష్టమైనదిగా భావిస్తున్నారు. ఈ రోజున నియమ నిష్టలతో పూజ చేసి.. శివ పంచాక్షరి, విష్ణు సహస్రనామం జపిస్తే.. మోక్షంతో కూడిన ఐశ్వర్యం సిద్ధిస్తుందని పండితులు అంటున్నారు. ఉపవాసం ఉండి.. హరిహరుల నామస్మరణ చేయడం వల్ల కోటి జన్మల పుణ్యం లభించడమే కాక.. శివుడు, విష్ణువు నామ స్మరణ చేసి.. దీపారాధన చేయడం ద్వారార కనక వర్షం కురుస్తుంది అంటున్నారు పండితులు.