అర్ధరాత్రి వేళ రైలుకు ఎదురెళ్లి వందల ప్రాణాలు కాపాడిన వృద్ధ దంపతులు.

చిమ్మచీకట్లు.. చేతిలో ఓ టార్చ్ తప్పా చుట్టూ ఎవరూ లేరు. ఇలాంటి పరిస్థితిలో ఓ వృద్ధ జంట పెద్ద సాహసం చేశారు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా రైలుకు ఎదురెళ్లి ప్రమాదాన్ని నివారించారు. వృద్ధ దంపతులు తమ వద్ద ఉన్న టార్చ్లైట్తోనే లోకో పైలట్కు సిగ్నల్ ఇచ్చి ఘోర దుర్ఘటన జరగకుండా నిలువరించిన ఈ ఘటన తమిళనాడులోని తెన్ కాశీ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కేరళా నుంచి తమిళనాడులోని తుత్తుకూడికి లారీ వెళ్తుంది.. తెన్‌కాశీ వద్ద ఎస్ వేలపు ప్రాంతంలోకి రాగానే అదుపు తప్పిలారీ రైల్వే ట్రాక్ పై బోల్తా పడింది. అదే సమయంలో తిరునెల్వేలి- పాలక్కడ్ ఎక్స్ ప్రెస్ రైలు వస్తుంది.

రైల్వే ట్రాక్ పై లారీ బోల్తా పడి ఉండటాన్ని తెన్‌కాశీకి చెందిన షన్ముగయ్య ఆయన భార్య కురుంతామ్మల్ గమనించారు. పెద్ద ప్రమాదం జరగబోతుందని భయపడ్డారు.. అంతలోనే ధైర్యం చేసి తమ ప్రాణాలు పోయినా పర్వాలేదు.. రైలుని ఆపాలని నిర్ణయించుకున్నారు. వెంటనే చేత్తో టార్చ్ పట్టుకొని ట్రాక్ పై పరుగెత్తుకుంటూ దంపతులు లోకో పైలట్ కి సిగ్నల్ ఇచ్చారు. అది గమనించి లోకో పైలట్ వెంటనే బ్రేకులు వేసి రైల్ ని ఆపాడు. దీంతో పెను ప్రమాదం తప్పిపోయింది. ఇదిలా ఉంటే రైల్వే ట్రాక్ పై అదుపుతప్పి పడిపోయిన లారీ పూర్తిగా ధ్వంసం అయ్యింది. అందులో ఉన్న డ్రైవర్ చనిపోయాడు. ప్రమాదాన్ని ముందుగా గమనించి క్లీనర్ లారీ దూకి తప్పించుకున్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. మృతి చెందిన లారీ డ్రైవర్ ముక్కుదాల్ ప్రాంతానికి చెందిన మణికందన్ గా గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టానికి తరలించారు. ఈ ప్రమాదంతో ఆ మార్గంలోని రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాక్ క్లీయర్ అయిన తర్వాత రైళ్ల రాకపోకలకు అనుమతినిచ్చారు అధికారులు. తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా షణ్మగయ్య, కురుంతమ్మాళ్ చేసిన సాహసానికి అధికారులు, స్థానికులు ప్రశంసలు కురిపించారు. తమ స్వార్థం మాత్రమే చూసుకునే ఈ రోజుల్లో వృద్ద దంపతులు చేసిన సాహసంపై అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.