ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. సీనియర్‌ నటి జమున కన్నుమూత!

టాలీవుడ్‌ ఇండస్ట్రీని విషాదాలు వదలడం లేదు. నూతన ఏడాది ప్రారంభం నుంచి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఒక్కొక్కరు కన్ను మూస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు ప్రేక్షకుల మదిలో సత్యభామగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్‌ నటి జమున​ కన్నుమూశారు. శుక్రవారం ఉదయం.. హైదరాబాద్‌లోని ఆమె స్వగృహంలో తుది శ్వాస విడిచారు. తెలుగు వెండి తెరపై దశాబ్దాలుగా రాణించిన జమున.. ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగు, తమిళ్‌లో సుమారు 180కిపైగా చిత్రాల్లో నటించిన జమున.. గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇక వయోభారం కారణంగా మృతి చెందినట్లు సమాచారం.

జమున 1936 ఆగష్టు 30 న హంపీలోజన్మించారు. ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. తండ్రి ఒక వ్యాపారవేత్త. జమున బాల్యం అంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. సినీనటుడు జగ్గయ్యదీ కూడా జమున గ్రామమే. దాంతో.. జమున కుటుంబానికి జగ్గయ్యతో ఎంతో కాలంగా పరిచయం ఉంది. చిన్నప్పటి నుంచి బెరుకు అంటే తెలియన జమున స్కూలులో చదివేకాలం నుంచే నాటకాల వైపు ఆకర్షితురాలయ్యింది. తెనాలి సమీపంలోని మండూరు గ్రామంలో ‘ఖిల్జీ రాజ్య పతనం ‘ అనే నాటిక ప్రదర్శన కోసం ప్రత్యేకంగా జగ్గయ్య జమున ఎంపిక చేసుకుని తీసుకువెళ్ళాడు. ఇదే నాటికలో మరో ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు కూడా నటించాడు. నాటకాలలో ఆమె ప్రతిభ అందరికి తెలియడంతో.. సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. బి.వి.రామానందం తీసిన పుట్టిల్లు ఆమె తొలిచిత్రం.

ఆ తరువాత అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, నందమూరి తారక రామారావు తదితర అగ్ర నటుల సరసన హీరోయిన్‌గా నటించారు. జమున తన కెరీర్‌లో ఎన్ని పాత్రలలో నటించినప్పటికి.. ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్రం.. శ్రీకృష్ణ తులాభారం చిత్రంలోని సత్యభామ పాత్రే. ఆ పాత్రలో ఇప్పటిటికీ ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్నట్టుగా నటించారు జమున. వినాయకచవితి చిత్రంలో మొదటి సారి సత్యభామ పాత్రలో కనిపించారు జమున. ఆ తర్వాత శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో కూడా అదే పాత్రలో నటించి.. తెలుగువారికి సత్యభామ అంటే జముననే అనే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. .

తెలుగు సినిమాలే కాక తమిళం, హిందీ సినిమాలలో కూడా నటించారు జమున. ఆమె నటించిన మిస్సమ్మ, ఇల్లరికం, ఇలవేల్పు, లేతమనసులు, గుండమ్మ కథ చిత్రాలు భారీ విజయం సాధించడమే కాక రజతోత్సవం కూడా జరుపుకున్నాయి. ఇక జమున రాజకీయాల్లో కూడా సక్సెస్‌ఫుల్‌గా రాణించారు జమున. ఇందిరా గాంధీ మీద ఉన్న అభిమానంతో.. కాంగ్రెస్‌ పార్టీలో చేరి.. 1989 ఎన్నికల్లో రాజమండ్రి నియోకవర్గం నుంచి లోక్‌సభకు ఎంపీగా ఎన్నియకయ్యారు. తరువాత రాజకీయాల నుంచి తప్పుకున్నా.. బీజేపీ తరఫున ప్రచారం చేశారు. జమున మృతి వార్త తెలిసి ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.