తారకరత్నకు తీవ్ర అస్వస్థత .! తారకరత్న ఆరోగ్యంపై బాలకృష్ణకు ఫోన్‌ చేసిన జూ. ఎన్టీఆర్‌

లోకేష్‌ పాదయాత్రలో నందమూరి తారకరత్న గుండె పోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు కుప్పంలోని పీఈఎస్‌ ఆస్పత్రిలో వైద్యం అందుతోంది. వైద్యులు తారకరత్నను అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈనేపథ్యంలోనే తారకరత్న ఆరోగ్యం గురించి తెలుసుకోవటానికి జూనియర్‌ ఎన్టీఆర్‌, బాలకృష్ణకు ఫోన్‌ చేశారు. తారకరత్న ఆరోగ్యం ఇప్పుడెలా ఉందో బాలకృష్ణను అడిగి తెలుసుకున్నారు. తారకరత్న భార్య కూడా బాలకృష్ణకు ఫోన్‌ చేశారు. భర్త ఆరోగ్యం ఎలా ఉందో మామను అడిగి తెలుసుకున్నారు.

ఇక, ఆసుపత్రిలోనే ఉన్న బాలకృష్ణ తారకరత్న ఆరోగ్యం గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కుటుంబసభ్యులకు తెలియజేస్తున్నారు.మరికొన్ని గంటల్లో కుటుంబసభ్యులు ఒక్కొక్కరిగా ఆసుపత్రికి వెళ్లే అవకాశం ఉంది. కాగా, టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌ యువగళం పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. శుక్రవారం ఉదయం 11 .03 గంటలకు ఈ యాత్ర మొదలైంది. బాలకృష్ణ, టీడీపీ నేతలతో కలిసి లక్ష్మీపురం వరదరాజస్వామి ఆలయంలో లోకేష్‌ పూజలు నిర్వహించారు. అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. లోకేష్‌ యాత్రకు మద్దతు తెలపటానికి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు వచ్చారు.

ఈ నేపథ్యంలోనే నందమూరి తారకరత్న కూడా లోకేష్‌ యాత్రకు మద్దతు తెలపటానికి యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని కుప్పంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం పీఈఎస్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తారకరత్న ఆరోగ్యంపై టీడీపీ కార్యకర్తలతో పాటు ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని పూజలు సైతం చేస్తున్నారు. మరి, తారకరత్న అనారోగ్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలయజేయండి.