హీరోయిన్‌ రంభ కారుకు యాక్సిడెంట్‌.

ఒకప్పటి స్టార్‌ హీరోయిన్ రంభకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు మంగళవారం యాక్సిడెంట్‌కు గురి అయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో రంభతో పాటు ఆమె పిల్లలు, వారి బాధ్యతలు చూసుకునే ఆయా ఒకరు ఉన్నారు. అయితే దేవుడి దయ వల్ల ఈ యాక్సిడెంట్‌లో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని రంభ తెలిపింది. సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది రంభ. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరలవుతోంది.

రంభ పోస్ట్‌ చేసిన దాని ప్రకారం ‘‘పిల్లలను స్కూల్ నుంచి తీసుకు వస్తుండగా… ఇంటర్ సెక్షన్ దగ్గర మా కారును మరో కారు ఢీ కొట్టింది. అప్పుడు కారులో నాతో పాటు పిల్లలు, ఆయా ఉన్నారు. దేవుడి దయ వల్ల ఈ ప్రమాదంలో మాకు చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. మేం అందరం సురక్షితంగా ఉన్నాం. కాకపోతే చిన్నారి సాషా ఇంకా ఆసుపత్రిలోనే ఉంది. టైమ్‌ అస్సలు బాగాలేదు. దయచేసి మా కోసం దేవుడిని ప్రార్థించండి. చిన్నారి సాషా త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. ఈ సమయంలో మీ ప్రార్థనలు మాకు ఎంతో అవసరం’’ అని తెలిపింది.

అంతేఆకా ఆస్పత్రిలో ఉన్న చిన్నారి ఫోటోతో పాటు కార్ యాక్సిడెంట్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది రంభ. ఇక నటి ప్రయాణిస్తున్న కారు ఎస్‌యువి కార్ కావడంతో యాక్సిడెంట్ అయిన వెంటనే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెను ముప్పు తప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు బాగా డ్యామేజ్‌ అయ్యింది. ఈ పోస్ట్‌ చేసిన నెటిజనలు, అభిమానులు షాక్‌ అయ్యారు. మీకేం కాలేదు కదా.. సాషా కూడా త్వరగా కోలుకుంటుంది.. ధైర్యంగా ఉండండి మేడం అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఒకప్పుడు తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది రంభ. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌.. ఇలా స్టార్‌ హీరోలందరితో నటించింది. తెలుగుతో పాటు.. తమిళ, హిందీ సినిమాల్లోనూ హీరోయిన్‌గా చేసింది. సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన తర్వాత.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమదొంగ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘దేశముదురు’ సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో చేసింది. ప్రస్తుతం గత కొన్నాళ్లుగా ఆమె లైమ్‌ లైట్‌కు దూరంగా ఉంటుంది. సినిమాలు పక్కన పెట్టి.. పూర్తి సమయం ఫ్యామిలీకే కేటాయిస్తూ… పిల్లలతో బిజీ బిజీగా గడుపుతోంది. రంభ భర్త ఇందిరన్ పద్మనాభన్. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం ఉన్నారు. వివాహం తర్వాత రంభ కెనాడాలో సెటిల్‌ అయ్యింది. ఈ ప్రమాదం కూడా అక్కడే జరిగింది.